Digital Crop Survey Telangana : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి సెంటు భూమిలో ఏ పంట సాగవుతుందో కచ్చితంగా లెక్కించే డిజిటల్ క్రాప్ సర్వే (DCS) ప్రక్రియను మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు (CS Ramakrishna Rao) అధికారులను సోమవారం ఆదేశించారు.
సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ‘అగ్రిస్టాక్’ (AgriStack), డిజిటల్ క్రాప్ సర్వేపై కీలక సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు, అగ్రిస్టాక్ చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ రాజీవ్ చావ్లా ఈ సమావేశంలో పాల్గొని, ఇతర రాష్ట్రాల్లో (యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక) ఈ ప్రక్రియ పూర్తయిన తీరును వివరించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మార్చి 15వ తేదీలోగా డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎన్ ఐసి అధికారుల సహకారంతో సర్వేను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో 10, 877 గ్రామాల్లో డిసిఎస్ సర్వే చేపట్టామని అధికారులు సీఎస్కు వివరించారు. సీజినల్ డిజిటల్ క్రాప్ సర్వేతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలకు ప్రయోజనం చేకూరుతుందని, అదేవిధంగా స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జిఎస్డిపి) గణాంకాలకు ఈ సర్వే ఉపయోగపడుతుందని సీఎస్ పేర్కొన్నారు. దేశంలోని యూపీ, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ పూర్తి అయిందని కేంద్ర ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ చావ్లా ఈసందర్భంగా వెల్లడించారు. అదే తరహాలో తెలంగాణలో కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ సంచాలకులు గోపి ఇప్పటి వరకు చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే వివరాలను ఉన్నతాధికారులకు వివరించారు.
సర్వే (Digital Crop Survey ) ముఖ్యాంశాలు:
- గ్రామాల సంఖ్య: రాష్ట్రవ్యాప్తంగా 10,877 గ్రామాల్లో ఈ సర్వే చేపట్టడం జరిగింది.
- మార్చి 15వ తేదీని డెడ్లైన్గా నిర్ణయించారు.
- జిల్లా కలెక్టర్లు, ఎన్ఐసి (NIC) అధికారుల సమన్వయంతో ఏఈఓలు ఈ సర్వేను పూర్తి చేయాలి.
డిజిటల్ క్రాప్ సర్వే వల్ల లాభాలేంటి?
- ఈ సర్వే కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదు, దీనివల్ల రైతులకు మరియు ప్రభుత్వానికి పలు ప్రయోజనాలు ఉన్నాయి:
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రైతు భరోసా, పీఎం కిసాన్, పంట బీమా వంటి పథకాలకు ఈ డేటా ప్రామాణికంగా మారుతుంది.
- రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) అంచనా వేయడానికి ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఉందో కచ్చితంగా తెలుస్తుంది.
- బ్యాంకు రుణాలు, ఇతర సబ్సిడీలు పొందేటప్పుడు పంట వివరాల ధ్రువీకరణ సులభమవుతుంది.
మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం X , ఫేస్బుక్ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..




