
రైతులకు శుభవార్త చెప్పిన Telangana Government
తెలంగాణలోని అన్నదాతలకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవడ్ల బోనస్ (Fine Rice Bonus) నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం రూ.514.36 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్లో సన్నవడ్లు పండించిన లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి బోనస్
ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, సన్నవడ్లు విక్రయించిన 2.17 లక్షల మంది రైతులకు ఈ బోనస్ అందించబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే క్వింటాల్కు ₹500 బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బకాయిలను విడుదల చేయడంతో రైతులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బోనస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP)కి అదనంగా ఇవ్వబడుతుంది.
Fine Rice Bonus : 33 రకాల సన్నబియ్యం పండించిన వారికి మాత్రమే..
ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నబియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ధాన్యంలో తేమ శాతం, గింజ నాణ్యత వంటి ప్రమాణాలను పరిశీలించిన తర్వాత బోనస్ ఖరారు చేస్తారు. నాణ్యత ప్రమాణాలను పాటించిన రైతులకే ఈ అదనపు ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది.
గత కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పంట పెట్టుబడి ఖర్చుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ బోనస్ విడుదల కీలకంగా మారింది. తాజా నిర్ణయం రైతులకు కొంతమేర ఉపశమనం కలిగించింది.
రైతుల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వ చర్యలు
వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. అదనపు బోనస్ ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు, సన్నవడ్ల సాగుకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా Telanganaలో సన్నబియ్యం ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు.

