Jeevamrutham Preparation and Spraying Guide | రసాయనిక ఎరువులు, పురుగుమందుల విచ్చలవిడిగా వినియోగించడం వల్ల భూమి నిస్సారమైపోతోంది. సేంద్రియ పదార్థం వేగంగా నశిస్తోంది. ఫలితంగా పొలాలు నిస్సారంగా మారి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిలో భూమిని తిరిగి సజీవంగా మార్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేందుకు రైతులు ముందుకు రావాలి. సేంద్రియ సాగు పద్ధతుల్లో కీలకమైనది ‘జీవామృతం’. ఇది భూమిలో సూక్ష్మజీవులను చైతన్యపరచి, భూసారాన్ని సహజంగా పెంచుతుంది.
ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు ముఖ్యమైన చక్రాలు ఉన్నాయి.
- జీవామృతం
- బీజామృతం
- ఆచ్ఛాదన (మల్చింగ్)
- నీటి యాజమాన్యం
వీటిలో భూమికి నేరుగా జీవం పోసేది జీవామృతం.
జీవామృతం అంటే ఏమిటి?
జీవామృతం అనేది పశువుల పేడ, మూత్రం ఆధారంగా తయారయ్యే సహజ ద్రవరూపంలో ఉంటే ఎరువు. ఇది భూమిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను మేల్కొలిపి, మొక్కలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.
జీవామృతం వాడకం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇది భూమిలో సూక్ష్మజీవరాశి వేగంగా పెరుగుతుంది. వానపాములు విస్తరిస్తాయి భూమిలోని పోషకాలన్నీ మొక్కలకు నేరుగా అందుతాయి. నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. భూమి నిర్మాణం మెరుగుపడుతుంది. పంట దిగుబడి, నాణ్యత రెండూ పెరుగుతాయి
జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి):
నీరు: 200 లీటర్లు.
పశువుల పేడ: 10 కిలోలు (ఆవు, ఎద్దు లేదా గేదె పేడ).
పశువుల మూత్రం: 5 నుండి 10 లీటర్లు.
బెల్లం: 1 నుండి 4 కిలోలు (నల్లబెల్లం శ్రేష్ఠం).
పప్పుధాన్యాల పిండి: 1 కిలో (ఉలవ, అలసంద, కంది, పెసర మొదలైనవి).
మట్టి: పిడికెడు పొలం గట్టు మట్టి.
తయారీ విధానం:
- ఎండ తగలని చోట ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిని తీసుకోవాలి.
- పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ నీటిలో వేసి బాగా కలపాలి.
- ఒక కర్రతో సవ్యదిశలో (Clockwise) కలియతిప్పి, పైన గోనె సంచి కప్పాలి.
- రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో నిమిషం పాటు కలియతిప్పాలి.
- 48 గంటల తర్వాత జీవామృతం వాడకానికి సిద్ధమవుతుంది. దీనిని వారం రోజుల్లోగా వాడాలి.
పంటలపై జీవామృతం పిచికారీ షెడ్యూల్:
పంటలపై జీవామృతం పిచికారీ విధానం
3 నెలల్లో పూర్తయ్యే పంటలు (60–90 రోజులు)
- మొదటిసారి (నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీ. జీవామృతం
- రెండోసారి (21 రోజుల తర్వాత) 150 లీ. నీటికి 10 లీ. జీవామృతం
- మూడోసారి (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. నీమాస్త్రం
- నాలుగోసారి (గింజ దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ
6 నెలల్లో పూర్తయ్యే పంటలు (150–180 రోజులు)
- మొదటిసారి – 100 లీ. నీటికి 5 లీ. జీవామృతం
- రెండోసారి – 150 లీ. నీటికి 10 లీ. జీవామృతం
- మూడోసారి – 200 లీ. నీమాస్త్రం
- నాలుగోసారి – 200 లీ. నీటికి 20 లీ. జీవామృతం
- ఐదోసారి – 200 లీ. నీటికి 20 లీ. జీవామృతం
- ఆరోసారి – 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ
మొదటి రెండు నెలలు పైన పేర్కొన్న విధంగానే చేసి, ఆ తర్వాత ప్రతి 30 రోజులకు ఒకసారి జీవామృతాన్ని (20 లీటర్లు) పిచికారీ చేయాలి. చివరగా గింజ ఏర్పడే దశలో 6 లీటర్ల పుల్లమజ్జిగను వాడాలి.
ముగింపు
రసాయనిక వ్యవసాయం వల్ల దెబ్బతిన్న భూమిని తిరిగి సజీవంగా మార్చే శక్తి జీవామృతానికి ఉంది. తక్కువ ఖర్చుతో, సహజంగా, నేల ఆరోగ్యాన్ని పెంచాలంటే ప్రతి రైతు జీవామృతాన్ని అలవాటు చేసుకోవాల్సిందే. ఇది భూమికి జీవం… రైతుకు, మన ఆరోగ్యానికి కూడా భరోసానిస్తుంది.
మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం X , ఫేస్బుక్ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..




