PM E-Drive Scheme Budget 2026 : మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కేంద్ర బడ్జెట్ 2026లో వినియోగదారులకు సంబంధించిన కీలక అప్డేట్స్ వచ్చాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘PM E-డ్రైవ్’ పథకానికి సంబంధించి నిధుల కేటాయింపు, గడువుపై తాజాగా స్పష్టత వచ్చింది.
ఈ బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే:
- PM E-Drive పథకానికి రూ.1,500 కోట్లు
2026-27 (FY27) ఆర్థిక సంవత్సరానికి గానూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ కోసం రూ.1,500 కోట్లు కేటాయించింది. గత సంవత్సరం సవరించిన బడ్జెట్ (రూ.1,300 కోట్లు) కంటే ఇది కొంత ఎక్కువ. దీనివల్ల మరిన్ని వాహనాలకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. ఇది కొనుగోలుదారులకు శుభవార్తే..
- టూవీలర్, త్రీవీలర్ సబ్సిడీలకు గడువు!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (E-Bikes), త్రిచక్ర వాహనాలు (E-Autos) కొనే వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీలు మార్చి 31, 2026 నాటికి ముగియనున్నాయి. అంటే, మీరు సబ్సిడీ ప్రయోజనం పొందాలంటే ఈలోపే వాహనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వీటిని దశలవారీగా తొలగించాలని నిర్ణయించింది.
- ట్రక్కులు, బస్సులకు 2028 వరకు ఛాన్స్
టూవీలర్లకు సబ్సిడీ ముగిసినా, ఎలక్ట్రిక్ ట్రక్కులు, బస్సులు, అంబులెన్స్లకు మాత్రం ప్రోత్సాహకాలు మార్చి 2028 వరకు కొనసాగుతాయి. కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో భారీ వాహనాలపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తోంది. - ఛార్జింగ్ నెట్వర్క్ కోసం రూ.2,000 కోట్లు
మీ గ్రామం, లేదా పట్ణణం లేదా హైవేలపై ఛార్జింగ్ స్టేషన్ల కొరత ఉందా? అయితే ఇది మీకు శుభవార్తే! దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు బడ్జెట్లో రూ.2,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 22,100 ఫాస్ట్ ఛార్జర్లు (కార్ల కోసం), 48,400 ఛార్జర్లు (టూవీలర్ల కోసం) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సబ్సిడీ పొందిన వాహనాల లెక్కలివే..
గత అక్టోబర్ 2024లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధి పొందారు:
ఇప్పటివరకు 21.24 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది.
ఎలక్ట్రిక్ ఆటోల (L5 Category) లక్ష్యం ఇప్పటికే పూర్తవ్వడంతో వాటికి సబ్సిడీలు నిలిపివేశారు.
ముగింపు :
మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తుంటే, మార్చి 2026 లోపు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆ తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఛార్జింగ్ స్టేషన్లు పెరగనున్నాయి. దీనివల్ల ఈవీ ప్రయాణం మరింత సులభతరం కానుంది.





