హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ‘రైతునేస్తం (Rythu Nestham) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) , రైతులతో ముఖాముఖి సంభాషించారు. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన ‘యూరియా యాప్ (Urea App Telangana)’ పనితీరు, ప్రయోజనాలపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
లైన్లలో నిలబడే తిప్పలు తప్పాయి: రైతులు
యూరియా యాప్ పట్ల రైతులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఇంట్లో ఉండే బుక్ చేసుకుని, వీలున్నప్పుడు తెచ్చుకునే వెసులుబాటు కలిగిందని మంత్రికి వివరించారు. సమయం వృథా కాకుండా చూస్తున్న ఈ యాప్ను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు.
అధిక యూరియా వాడకం ఆందోళనకరం
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. దేశంలో అధికంగా యూరియా వాడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అధికంగా యూరియా వాడటం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. యూరియా అతిగా వాడితే పంటలకు చీడపీడల సమస్య పెరుగుతుంది. క్రమంగా దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందని, రైతులు శాస్త్రీయ పద్ధతిలోనే ఎరువులను వాడాలని సూచించారు.
Rythu Nestham : పంట వ్యర్థాలను కాల్చవద్దు.. పామాయిల్ సాగు మేలు!
కోతల సమయం దగ్గర పడుతున్న తరుణంలో, పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చవద్దు అని మంత్రి పిలుపునిచ్చారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూమిలోని మిత్ర పురుగులు నశిస్తాయని హెచ్చరించారు. అలాగే, స్థిరమైన ఆదాయం కోసం రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని, పామాయిల్ తో పాటు వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను అంతర పంటలుగా పండించుకోవచ్చని వివరించారు.

