Telangana Urea Supply 2026 | రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టతనిచ్చారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
గత 8 ఏళ్లలో అత్యధిక అమ్మకాలు
ప్రస్తుత యాసంగి (2025–26) సీజన్లో గత 8 సంవత్సరాలతో పోలిస్తే రికార్డు స్థాయిలో యూరియా పంపిణీ జరిగింది. డిసెంబర్ 31 నాటికే: 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేశాం. గత ఏడాదితో పోలిక: 2024-25లో డిసెంబర్ నాటికి 3.04 లక్షల టన్నులు ఉంటే, ఈసారి అదనంగా మరో లక్ష టన్నులను పంపిణీ చేశాం. కేంద్ర కేటాయింపులు: కేంద్రం 5.60 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయిస్తే, ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించుకుంది.
| సంవత్సరం | యూరియా అమ్మకాలు (మెట్రిక్ టన్నులలో) |
| 2018–19 | 2.57 లక్షలు |
| 2019–20 | 2.42 లక్షలు |
| 2020–21 | 1.22 లక్షలు |
| 2023–24 | 2.17 లక్షలు |
| 2024–25 | 3.04 లక్షలు |
| 2025–26 (ప్రస్తుతం) | 4.04 లక్షలు |
యూరియా యాప్ – వినూత్న ప్రయోగం
కేంద్రం ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్ యాప్’ విజయవంతం కావడంతో, రాష్ట్రంలో యూరియా పంపిణీ కోసం ప్రయోగాత్మకంగా 5 జిల్లాలలో యూరియా యాప్ను అమలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 20 నుండి ఇప్పటి వరకు 1.18 లక్షల మంది రైతులు 3.36 లక్షల బస్తాల యూరియాను ఈ యాప్ ద్వారా కొనుగోలు చేశారు. ప్రతి రిటైల్ అవుట్లెట్ దగ్గర ఒక వాలంటీర్ను ఉంచి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. కౌలు రైతులు, పట్టాలు లేని రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నాం. “నేను స్వయంగా రైతు వేదికల ద్వారా రైతులతో మాట్లాడాను, వారు యాప్ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు. రైతుల ఆతృతను రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తే వారు క్షమించరు” అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..



