
కలెక్టర్ పర్యవేక్షణ.. రైతులకు కీలక సూచనలు
Warangal Market Prices Today | ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో మార్కెట్ ధరలను పరిశీలిస్తే మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి.
మిర్చి (దేశి రకం): ఫిబ్రవరి 19న ఈ రకం క్వింటాల్కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 20వ తేదీన గరిష్ట ధర ₹37,000 గా నమోదైంది.
వండర్ హాట్: రెండు రోజులూ గరిష్ట ధర ₹37,000 వద్ద స్థిరంగా కొనసాగింది.
పత్తి (CCI): ప్రభుత్వం (CCI) ద్వారా కొనుగోలు చేసిన పత్తికి గరిష్టంగా ₹8,010 లభించింది.
పసుపు: ఫిబ్రవరి 19న పసుపు (గోల) క్వింటాల్కు ₹11,114 గరిష్ట ధర పలికి రైతులకు ఊరటనిచ్చింది.
ఇతర పంటలు: కందులు గరిష్టంగా ₹7,520, మినుములు ₹8,150, మరియు నువ్వులు (తెల్లవి) గరిష్టంగా ₹9,752 ధరలను సాధించాయి.
మార్కెట్ను సందర్శించిన జిల్లా కలెక్టర్
వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారద శుక్రవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలను పరిశీలించారు. మిర్చి సీజన్ నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు.
మిర్చి బస్తాల్లో 49 కిలోల కంటే ఎక్కువ బరువు నింపవద్దని కలెక్టర్ రైతులకు సూచించారు. ఎక్కువ బరువు ఉంటే కాయ నాణ్యత తగ్గి, తక్కువ ధర వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. బస్తాల బరువుపై గ్రామస్థాయిలో కరపత్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని మార్కెట్ కార్యదర్శిని ఆదేశించారు. బరువు ఎక్కువైతే కాయ నాణ్యత తగ్గి ధర తగ్గే అవకాశం ఉందని సూచించారు.
మహిళా రైతుల సౌకర్యార్థం మార్కెట్లో ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మించాలని ఆదేశించారు.రైతులకు ఇతర మార్కెట్ ధరలు కూడా తెలిసేలా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ముసలమ్మకుంట మామిడి మార్కెట్ వద్ద రోడ్ల లెవలింగ్, మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ డా. సత్యశారద అధికారులను ఆదేశించారు.

