బ్యాటరీ లేకుండానే బండి
Bounce Infinity electric scooter : బెంగళూరుకు చెందిన స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ కంపెనీ బౌన్స్ సంస్థ త్వరలో దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. పూర్తిగా ఇండియాలోనే తయారు చేయబడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity ) అని పిలుస్తారు. దీని కోసం త్వరలో అధికారికంగా ప్రీ-బుకింగ్లు ప్రారంభమవుతాయి. జనవరి 2022 నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ చెబుతోంది.
ఈవీలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా బౌన్స్ సంస్థ దాని ప్రత్యర్థుల నుండి కాస్త డిఫరెంట్గా ఉండేలా ఈవీని అందించాలని యోచిస్తోంది. బౌన్స్ ఇన్ఫినిటీ స్మార్ట్, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. కస్టమర్లు తమ సౌలభ్యం, అవసరాలకు అనుగుణంగా ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, కంపెనీ ఒక ప్రత్యేకమైన ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ ఆప్షన్ను ఇస్తోంది. ఇది భారతీయ మార్కెట్లో ఇదే మొదటిది అని కంపెనీ పేర్కొంది.
- ఈ పథకం ప్రకారం.. వినియోగదారులు బ్యాటరీ లేకుండా సరసమైన ధరకు Bounce Infinity electric scooter ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనికి బదులుగా బౌన్స్ యొక్క బ్యాటరీ మార్పిడి నెట్వర్క్ను ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం ధరలో కేవలం బ్యాటరీ ధరే సుమారు 40 నుండి 50 శాతం వరకు ఉంటుంది. కాబట్టి ఈ స్కీం కింద బ్యాటరీ లేకుండా ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేయడం ధర తగ్గుతుంది.
బ్యాటరీ స్వాపింగ్తో..
కంపెనీ తన విస్తృత బ్యాటరీ-స్వాపింగ్ నెట్వర్క్ను వేగంగా అభివృద్ధి చేస్తోందని. ఇది దాని రిటైల్ కస్టమర్లకు మాత్రమే కాకుండా దాని విజయవంతమైన రైడ్-షేరింగ్ వ్యాపారానికి కూడా సేవలను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులు బౌన్స్ యొక్క స్వాపింగ్ నెట్వర్క్ నుంచి పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీని తీసుకోవచ్చరు. ఖాళీ బ్యాటరీని మార్చుకున్నప్పుడల్లా బ్యాటరీ మార్పిడి కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సంప్రదాయ స్కూటర్లతో పోలిస్తే ఇది స్కూటర్ రన్నింగ్ ఖర్చులను 40 శాతం వరకు తగ్గిస్తుందని బౌన్స్ సంస్థ పేర్కొంది.
22 మోటార్స్ సంస్థలో 100 శాతం వాటాను కంపెనీ కొనుగోలు చేసినట్లు బౌన్స్ కంపెనీ వెల్లడించింది. 2021లో డీల్ విలువ సుమారు $7 మిలియన్లు. 22మోటార్స్తో ఒప్పందంలో భాగంగా.. బౌన్స్ రాజస్థాన్లోని భివాడిలో ఉన్న దాని తయారీ కర్మాగారాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,80,000 యూనిట్లు. దక్షిణ భారతదేశంలో మరో ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాకుండా రాబోయే ఒక సంవత్సరంలో తన EV వ్యాపారంలో $100 మిలియన్ పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు బౌన్స్ ప్రకటించింది.




