Telangana Cabinet Decisions : రాష్ట్రంలో రైతుల సంక్షేమం, పాడి పరిశ్రమ అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం లభించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంటలు, పంట ఉత్పత్తులు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నష్టంపై తక్షణమే వివరాలను సేకరించి, బాధితులైన రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జి మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
నార్మక్ (NARMAC) ఇక ఎన్డీడీబీ పరిధిలోకి
నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని (NARMAC) నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు (NDDB) అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ ఎంవోయూ (MoU) ఒప్పందంతో, ఇకపై పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ మరియు డెయిరీ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను ఎన్డీడీబీ చేపట్టనుంది. ఇది పాడి రైతులకు మరింత ఆదాయాన్ని, మెరుగైన సేవలని అందించే దిశగా అడుగు.
సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్లు
రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా మొదట 18 ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.66.50 కోట్ల వ్యయంతో 19 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. తెలంగాణ ఇంధన రంగాన్ని స్వయం సమృద్ధం చేసే దిశగా ఇది ఒక కీలక ముందడుగు.










