- మందమర్రి సోలార్ ప్లాంట్లో ప్రయోగాత్మక ప్రాజెక్ట్ సత్ఫలితాలు
- ఉచితంగా గ్రిడ్కు వెళ్లే మిగులు విద్యుత్కు బ్యాటరీతో ‘చెక్’
- కేవలం 4 నెలల్లోనే సింగరేణికి రూ. 25.66 లక్షల ఆర్థిక లబ్ధి
- సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ముందడుగు
పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, తెలంగాణలోనే తొలిసారిగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (BESS – Singareni Battery Energy Storage System) అద్భుత విజయ సాధించింది. పగటిపూట ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తులో (Solar Power) వినియోగం కాకుండా మిగిలిపోయే కరెంట్ను వృథా పోనివ్వకుండా నిల్వ చేసుకునే ఈ సరికొత్త సాంకేతికత.. సింగరేణి సంస్థకు భారీగా ఆర్థిక లబ్ధిని చేకూరుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు.. నాలుగు నెలల క్రితం మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్కు అనుబంధంగా 1 మెగావాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ను యాజమాన్యం నెలకొల్పింది. ఇందుకోసం సింగరేణి సంస్థ సుమారు రూ. 2.5 కోట్లను వెచ్చించింది.
అసలు ఏంటి ఈ ‘బీఈఎస్ఎస్’ (BESS)? దీని ఉపయోగం ఏమిటి?
రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న భారీ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని సింగరేణి సంస్థ ఇప్పటికే ఎనిమిది ప్రాంతాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది.
- ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లు: వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు ఓపెన్ యాక్సెస్ కింద తెలంగాణ విద్యుత్ గ్రిడ్లకు అనుసంధానమయ్యాయి.
- ఇన్హౌజ్ ప్లాంట్లు: మిగిలిన 98.50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు ఇన్హౌజ్ (In-house) కేటగిరీకి చెందినవి. విద్యుత్ ఒప్పందం ప్రకారం.. ఈ ప్లాంట్ల ద్వారా వచ్చే కరెంట్ను స్థానిక అవసరాలకు వాడగా, మిగిలిన మిగులు విద్యుత్తుకు తెలంగాణ డిస్కమ్లు ఎలాంటి చెల్లింపులు జరపవు. ఆ మిగులు విద్యుత్తును ఉచితంగానే గ్రిడ్కు సరఫరా చేయాల్సి ఉంటుంది.
దీనివల్ల రోజుకు వేలాది యూనిట్ల కరెంట్ ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా ఉచితంగా గ్రిడ్కు వెళ్ళిపోయేది. ఈ మిగులు విద్యుత్తును కూడా సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ‘బీఈఎస్ఎస్’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
నాలుగు నెలల్లోనే రూ. 25 లక్షల ఆదాయం!
మందమర్రిలో గల 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రస్తుతం మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలలోని గనులు (Mines), సింగరేణి కాలనీల విద్యుత్ అవసరాలను తీరుస్తోంది. ఇక్కడి లోకల్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిపోతున్న కరెంట్ను జనవరిలో ఏర్పాటు చేసిన ‘బీఈఎస్ఎస్’ యూనిట్ లో నిల్వ చేయడం ప్రారంభించారు. గత నాలుగు నెలల్లో ఈ బ్యాటరీ సిస్టమ్ ద్వారా కస్టమర్ల స్థానిక అవసరాలకు వినియోగించగా.. ఇంకా మిగిలిన 3,35,485 యూనిట్ల విద్యుత్తును నిల్వ చేసుకుని, అవసరమైన పీక్ అవర్స్లో వినియోగించుకున్నారు. తద్వారా సింగరేణి సంస్థకు కేవలం 4 నెలల్లోనే రూ. 25,66,460 ల ఆర్థిక లబ్ధి చేకూరింది.
కేవలం ఒక మెగావాట్ సామర్థ్యం గల చిన్న యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్తును ఆదా చేయడం పట్ల సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
మరిన్ని ప్రాజెక్టులకు సింగరేణి సన్నద్ధం
ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘బీఈఎస్ఎస్’ ప్రాజెక్ట్ వంద శాతం విజయవంతం కావడంతో, పునరుత్పాదక పర్యావరణహిత ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న మిగతా ఇన్హౌజ్ సోలార్ ప్లాంట్లలో కూడా ఇలాంటి బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్ ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం సన్నద్ధమవుతోంది.




