Delhi Free Solar Panel Scheme : పెరిగిపోతున్న విద్యుత్ భారం నుంచి ప్రజలకు ఊరట కల్పించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలోని 2.3 లక్షల ఇండ్లకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లు అమర్చాలని నిర్ణయించింది. దీని కోసం రాష్ట్ర సోలార్ ఎనర్జీ పాలసీకి రెండోసారి సవరణలు చేసింది.
ఈ పథకం కింద సోలార్ ప్యానెళ్ల ఇన్స్టలేషన్ మాత్రమే కాకుండా, వాటి నిర్వహణ (Maintenance) ఖర్చులను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మంత్రి ఆశిష్ సూద్ మీడియాకు వెల్లడించారు.
పథకం ముఖ్య విశేషాలు & లబ్ధి:
- ఉచిత విద్యుత్: సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు సుమారు 400 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది.
- పూర్తి సబ్సిడీ: ఇంటిపై 3 కిలోవాట్ల (3 kW) సామర్థ్యంగల సోలార్ ప్యానెల్ను అమర్చుతారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ స్కీమ్ కింద ₹78,000 రాయితీ అందిస్తుండగా, మిగిలిన ₹78,000 వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
- పాత పథకం కూడా అమలు: ఇప్పటికే అమల్లో ఉన్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం యథాతథంగా కొనసాగుతుంది.
- ఉచిత రిజిస్ట్రేషన్: ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు.
- డెడ్లైన్: వచ్చే ఏడాది మార్చి (2027) నాటికి 2.3 లక్షల ఇండ్లకు ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పాలసీలో మార్పునకు కారణం:
గృహాల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ‘పీఎం సూర్య ఘర్ స్కీమ్’ అందుబాటులో ఉన్నప్పటికీ, నిర్వహణ ఖర్చులు మరియు ప్రారంభ వ్యయం కారణంగా ప్రజలు దానిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. గత నిబంధనల ప్రకారం ఐదేళ్ల తర్వాతే ప్రభుత్వం ప్రోత్సాహకం అందించేది.
ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఢిల్లీ ప్రభుత్వం వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉచిత ఇన్స్టలేషన్, ఉచిత నిర్వహణ బాధ్యతలను తనపై వేసుకుంటూ ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.




