Harithamithra Telugu News

Home General News Sundarbans Mangrove plantation | ‘గ్రీన్’ విప్లవం – కేసీఆర్ జన్మదినం సందర్భంగా 10 వేల...

Sundarbans Mangrove plantation | ‘గ్రీన్’ విప్లవం – కేసీఆర్ జన్మదినం సందర్భంగా 10 వేల మడ మొక్కల పెంపకం !

0
Sundarbans Mangrove plantation

కోల్‌కతా/హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని (ఫిబ్రవరి 17), ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతమైన సుందర్ బన్ (Sundarbans) అడవుల్లో 10 వేల మడ మొక్కలను (Sundarbans Mangrove plantation) నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల పరీవాహక ప్రాంతంలోని ఈ సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కాపాడడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం.

సుందర్ బన్ అడవుల రక్షణే లక్ష్యం..

  • ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో సుందర్ బన్ ఒకటి.
    మడ అడవులు తీర ప్రాంతానికి ‘గ్రీన్ ఆర్మ్’ (Green Arm) లాంటివి. ఇవి సునామీలు, తుఫాన్ల తీవ్రతను అడ్డుకుంటాయి.
  • ఐలా, అంఫాన్, యాస్, సిత్రాంగ్ వంటి వరుస తుఫాన్ల వల్ల సుందర్ బన్ అడవుల మనుగడకు తీవ్ర ముప్పు ఏర్పడింది. నేలలో ఉప్పునీరు చేరడం వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటోంది.
  • ఈ ఒత్తిడిని తగ్గించి, అడవులకు మరలా ప్రాణం పోసేందుకు ఈ పదివేల మొక్కల నాటే ప్రక్రియను చేపట్టారు.

తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా ‘హరిత’ ఉద్యమం

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘హరితహారం’ కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోకుండా, ఒక సామాజిక బాధ్యతగా మారింది. 2018లో సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం ద్వారా ఇప్పటివరకు 195 మిలియన్ల మొక్కలను నాటారు. మొక్కలతో పాటు 20,000కు పైగా జలవనరులకు పునరుజ్జీవం పోయడం ఈ ఛాలెంజ్ సాధించిన మరో గొప్ప మైలురాయిగా నిలిచింది. విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేస్తూ పర్యావరణ స్పృహను పెంపొందించారు.

“పర్యావరణ ప్రేమికులందరినీ ఏకం చేసి, కేసీఆర్ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయడమే మా లక్ష్యం. సుందర్ బన్ వంటి కీలక ప్రాంతాల్లో మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడతామని ఈసందర్భంగా జోగినపల్లి సంతోష్ కుమార్ వెల్లడించారు.

ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజును పర్యావరణ వేడుకగా జరుపుకోవడం ఇప్పుడు ఒక ఆచారంగా మారింది. సుందర్ బన్ స్థానికులు, యువత సహకారంతో ఈ 10,000 మొక్కలను నాటి, ఈ అడవుల ప్రాముఖ్యతను భావి తరాలకు తెలియజేయాలనే కృతనిశ్చయంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం ముందుకు సాగుతోంది.


మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.  

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్  కోసం  X , ఫేస్​బుక్​ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Previous articleSuzuki e-Access ఈవీ స్కూట‌ర్‌పై 7 ఏళ్ల వారంటీ, 60% బైబ్యాక్ గ్యారెంటీ!
Next articlePoultry Vaccination : పెరటి కోళ్ల పెంపకంలో టీకాలతో రక్షణ – గ్రామీణ యువతకు ప్రత్యేక శిక్షణ
Kavya P
కావ్య‌. హ‌రిత‌మిత్ర‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. జ‌ర్న‌లిజంలో 16 ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఈమె వ్య‌వ‌సాయ రంగం, జీవ‌న‌శైలికి సంబంధించిన వార్త‌ల‌ను అందిస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here