Harithamithra Telugu News

Home Solar Energy Floating Solar | రిజర్వాయర్లపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు

Floating Solar | రిజర్వాయర్లపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు

0
Floating Solar
Omkareshwar Floating Solar Project
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన!
  • విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి
  • నాగార్జునసాగర్, శ్రీశైలం, మల్లన్నసాగర్ సహా ప్రధాన రిజర్వాయర్లపై అధ్యయనం
  • వార్షికంగా రూ.19,000 కోట్ల విద్యుత్ సబ్సిడీ భారం.. ప్రత్యామ్నాయంగా సోలార్ గ్రిడ్లు

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి మరియు భవిష్యత్ అవసరాల కోసం ఫ్లోటింగ్ సోలార్ (Floating Solar), ఇతర సంప్రదాయేతర ఇంధన వనరులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. అసెంబ్లీ ప్రశ్నల సమయంలో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమగ్ర సమాధానమిచ్చారు.

ప్రధాన రిజర్వాయర్లలో క్షేత్రస్థాయి అధ్యయనం:

రాష్ట్రంలోని ప్రధాన మరియు మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలను నీటిపారుదల, విద్యుత్ శాఖలు సంయుక్తంగా పరిశీలిస్తున్నాయని భట్టి వెల్లడించారు.

  • పరిశీలనలో ఉన్న ప్రాజెక్టులు: నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, కొమురంభీం, పాలేరు, వైరా, మల్లన్నసాగర్, ఎల్‌ఎండీ (LMD), మిడ్‌మానేరు, పోచారం.
  • వీటితో పాటు మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం వంటి ప్రాంతాల ప్రాజెక్టులలోనూ అధ్యయనం కొనసాగుతోందన్నారు.

అదనపు వ్యయమే ప్రధాన సవాల్:

సాధారణ సోలార్ ప్లాంట్లతో పోలిస్తే ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుకు వ్యయం ఎక్కువవుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కేంద్రం ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ (VGF) కింద మెగావాట్‌కు రూ. కోటి సాయం ప్రకటిస్తున్నప్పటికీ, కేవలం దేశీయ పరికరాలనే ఉపయోగించాలనే కఠిన నిబంధనల వల్ల మెగావాట్‌కు సుమారు రూ. 1.30 కోట్ల వరకు అదనపు భారం పడుతోందన్నారు. ఈ నిబంధనలు సడలిస్తే పెట్టుబడిదారులు మరింత ఉత్సాహంగా ముందుకొస్తారని అభిప్రాయపడ్డారు.

2023 డిసెంబర్‌లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గరిష్ఠ డిమాండ్ 15,000 మెగావాట్లు ఉండగా, సెప్టెంబర్ 9 నాటికి అది ఏకంగా 19,000 మెగావాట్లకు చేరిందని సభకు తెలిపారు. పారిశ్రామిక వృద్ధి, కొనుగోలు శక్తి పెరగడమే దీనికి కారణమని, డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తి పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఏడాదికి రూ.19 వేల కోట్ల సబ్సిడీ:

  • వ్యవసాయం: ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 14,000 కోట్లు భరిస్తోంది.
  • గృహ వినియోగం (గృహజ్యోతి): 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా 55 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుండగా, దీనికి రూ. 5,000 కోట్లు వ్యయం అవుతోంది.
  • మొత్తం భారం: సబ్సిడీల రూపంలోనే ప్రభుత్వం ఏటా రూ. 19,000 కోట్లు వెచ్చిస్తోందని, ఈ భారాన్ని తగ్గించుకోవడానికే సోలార్, పంప్డ్ స్టోరేజ్ వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు.

80 గ్రామాల సోలరైజేషన్ & ఇందిరా సౌర గిరి జల వికాసం:

  • అమ్రాబాద్ మోడల్: అమ్రాబాద్ గిరిజన ప్రాంతంలోని 80 గ్రామాలను పూర్తిగా సోలరైజ్ చేసి మైక్రో గ్రిడ్‌ల ద్వారా విద్యుత్ అందించే పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు.
  • ఇందిరా సౌర గిరి జల వికాసం: ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ (FRA) కింద గిరిజనులకు ఇచ్చిన 6.70 లక్షల ఎకరాల భూముల్లో సౌర విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
  • రైతులకు పిలుపు: ప్రతి గ్రామంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు, ప్రజలు ముందుకు వచ్చేలా స్థానిక ఎమ్మెల్యేలు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Previous articleభారత EV మార్కెట్లోకి ‘విన్‌ఫాస్ట్’ ఎంట్రీ | ఇక అసలు పోటీ మొదలైంది ..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here