Harithamithra Telugu News

Home General News Kisan Diwas : రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ టాప్ 10 పథకాలు

Kisan Diwas : రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ టాప్ 10 పథకాలు

0
kisan diwas

దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు అందిస్తున్న సేవలను గౌరవిస్తూ, భారతదేశ 5వ ప్రధానమంత్రి, రైతు హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయ‌కుడు చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న కిసాన్ దివస్ (Kisan Diwas 2025 – జాతీయ రైతు దినోత్సవం) ను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. భూ సంస్కరణలు అమలుచేయడంలో, రైతుల హక్కుల పరిరక్షణలో చరణ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2001లో ఈ రోజును జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది.

Kisan Diwas : ఈ ఏడాది థీమ్

కిసాన్ దివస్ 2025 సందర్భంగా “విక్షిత్ భారత్ 2047 – భారత వ్యవసాయాన్ని ప్రపంచీకరించడంలో FPOల పాత్ర” అనే అంశాన్ని కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ రంగాన్ని ప్రపంచ స్థాయిలో పోటీతత్వంగా మార్చడంపై ఈ ఏడాది ప్రత్యేక దృష్టి పెట్టారు.

రైతుల సంక్షేమానికి కేంద్ర పథకాలు

కిసాన్ దివస్ సందర్భంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాల గురంచి సంక్షిప్తంగా తెలుసుకుందాం..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN):

భూమి కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 ఆదాయ మద్దతును ఈ పథకం అందిస్తోంది. ఈ మొత్తాన్ని నాలుగు నెలలకోసారి రూ.2,000 చొప్పున మూడు వాయిదాల్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

  • భూమి కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 ప్రత్యక్ష ఆదాయ మద్దతు.
  • రూ.2,000 చొప్పున మూడు వాయిదాల్లో DBT ద్వారా రైతుల ఖాతాల్లో జమ.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY):

ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా రక్షణ కల్పించే పథకం ఇది. ఖరీఫ్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియంతో బీమా సదుపాయం కల్పిస్తున్నారు.

  • ప్రకృతి విపత్తులు, తెగుళ్లు, వ్యాధుల వల్ల పంట నష్టానికి బీమా రక్షణ.
  • 👉 రైతుల ప్రీమియం:
  • ఖరీఫ్ – 2%
  • రబీ – 1.5%
  • ఉద్యాన పంటలు – 5%

కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం:

రైతులు తక్కువ వడ్డీ రేట్లకు తక్షణ రుణాలు పొందేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లిస్తే రూ.3 లక్షల వరకు 4 శాతం వడ్డీ రేటుతో రుణ సదుపాయం లభిస్తోంది.

  • రూ.3 లక్షల వరకు రుణం
  • సకాలంలో చెల్లిస్తే 4% ప్రభావవంతమైన వడ్డీ మాత్రమే.

ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (PMKSY):

“ప్రతి చుక్కకు ఎక్కువ పంట” లక్ష్యంతో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడమే ఈ పథకం ఉద్దేశ్యం. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థల కోసం సబ్సిడీలు అందిస్తున్నారు.

  • డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలకు సబ్సిడీ.

ఈ-జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM):

దేశవ్యాప్తంగా ఉన్న APMC మార్కెట్లను అనుసంధానించి ఒకే జాతీయ మార్కెట్‌ను రూపొందించేందుకు ఈ డిజిటల్ వేదిక ఉపయోగపడుతోంది. పారదర్శక ధరల ఆవిష్కరణతో పాటు ఆన్‌లైన్ వ్యాపారానికి ఇది దోహదపడుతోంది.

  • పారదర్శక ధరల ఆవిష్కరణ
  • ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా మెరుగైన ధరలు.

సాయిల్ హెల్త్ కార్డ్ పథకం

నేల సారాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా రైతులకు ప్రయోగశాల పరీక్షల ఆధారంగా నేల ఆరోగ్య నివేదికలు అందిస్తున్నారు. సరైన ఎరువుల వినియోగంపై సూచనలు ఇస్తూ ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

  • 12 పోషక అంశాల విశ్లేషణ
  • సరైన ఎరువుల వినియోగంపై సూచనలు.

పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY):

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు క్లస్టర్ విధానంలో అమలు చేస్తున్న పథకం ఇది. హెక్టారుకు రూ.31,500 ఆర్థిక సహాయం అందిస్తుండగా, రైతులకు నేరుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

  • హెక్టారుకు రూ.31,500 ఆర్థిక సహాయం
  • రైతులకు నేరుగా రూ.15,000 ప్రోత్సాహకం.

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (AIF):

కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగులు వంటి పంటకోత అనంతర మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధి ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. రూ.2 కోట్ల వరకు రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నారు.

  • కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగుల ఏర్పాటుకు సాయం
  • రూ.2 కోట్ల వరకు రుణంపై 3% వడ్డీ రాయితీ.

ప్రధాన మంత్రి కుసుమ్ పథకం (PM-KUSUM):

రైతులు సౌరశక్తితో పనిచేసే నీటిపారుదల పంపులను ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం సహకరిస్తోంది. 30 నుంచి 50 శాతం వరకు సబ్సిడీతో పాటు మిగులు విద్యుత్తును డిస్కామ్‌లకు విక్రయించే అవకాశం కల్పిస్తోంది.

  • సోలార్ ప్యానెల్స్‌పై 30%–50% వరకు సబ్సిడీ
  • మిగులు విద్యుత్తును డిస్కామ్‌లకు అమ్ముకునే అవకాశం
  • త‌ద్వారా రైతుల‌కు అద‌న‌పు ఆదాయం

ప్రధాన మంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన (PM-KMY):

చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పెన్షన్ పథకం ఇది. 18–40 ఏళ్ల మధ్య వయస్సున్న రైతులు ఇందులో చేరవచ్చు. 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ అందుతుంది.

  • చిన్న, సన్నకారు రైతుల కోసం స్వచ్ఛంద పెన్షన్ పథకం.
  • వయస్సు: 18–40 సంవత్సరాలు
  • 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్.

ముగింపు

కిసాన్ దివస్ 2025 సందర్భంగా రైతుల ఆదాయం పెంపు, సాంకేతికత వినియోగం, మార్కెట్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు కీలకంగా మారాయి. విక్షిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో రైతులు కేంద్ర బిందువుగా నిలవనున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Previous articleEV Price Hike : కొత్త ఏడాదిలో ఏథర్ షాక్:
Next articleUrea Booking App | ఇకపై యాప్ ద్వారా యూరియా బుకింగ్.. క్యూ లైన్లకు చెక్!
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here