వానాకాలం సాగుపై మంత్రి తుమ్మల కీలక సమీక్ష:
వచ్చే వానాకాలం (ఖరీఫ్) సీజన్లో రైతులు సాగు చేసే వరి రకాలు (Fine Rice Varieties 2026) , విత్తనాల లభ్యత. మద్దతు ధర (MSP) కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, శాస్త్రవేత్తలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సచివాలయంలో ఈ రోజు వ్యవసాయశాఖ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం అందుబాటులో ఉంచాల్సిన వరి రకాల ఎంపిక, విత్తన లభ్యత, సాగు ప్రణాళికలపై వ్యవసాయశాఖ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వ్యవసాయశాఖ అధికారులతో చర్చలు జరిపారు.
వ్యవసాయశాఖ అధికారులు వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం BPT -5024, RNR-15048, HMT SONA, Jai Shreeram, KNM-1638, WGL-44, WGL 962,JGL 1798, మరికొన్ని సన్న రకాలను (Fine Rice Varieties 2026) సిద్ధం చేసినట్లు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత సంవత్సరం 33 రకాల సన్న రకాలను అందుబాటులో ఉంచడం వలన రైతులు అమ్మకాల సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు, కొన్నింటికి బోనస్ కూడా రాకుండా ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు.
రైతు ఉత్సవాల్లో అవగాహన
ఈ సంవత్సరం అలాంటి సమస్యలు రాకుండా పరిమిత రకాలు, రైతులకు అధిక దిగుబడి ఇచ్చే రకాలు అందుబాటులో ఉంచాలన్నారు. సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకొని, రాష్ట్రం, కేంద్రం కొనుగోలు చేసే పరిమాణాల ఆధారంగా విత్తనాల సరఫరా ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుండి 9 వరకు జరిగే రైతు ఉత్సవాల కార్యక్రమంలో మే 4 వ తేదిన ఈ విత్తనాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 కల్లా ఎంపిక చేసిన విత్తన రకాలను రైతులకు సిద్ధంగా ఉంచాలని అధికారులకు అన్నారు. అధిక దిగుబడి, మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలనే అందుబాటులో ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు.




