- రూ. 568.50 కోట్లతో మార్కెట్ల ఆధునీకరణ..
- జూలై నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలి!
Zero Business in Market Yards : తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధి, రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుట్టమైన చర్యలు తీసుకుంటోంది. బుధవారం మార్కెటింగ్, మార్క్ఫెడ్ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్లలో జరుగుతున్న అక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం:
మార్కెట్ యార్డుల్లో లైసెన్సులు కలిగి ఉండి, ఎలాంటి వ్యాపారం చేయకుండా ‘జీరో బిజినెస్’ (Zero Business in Market Yards) చేస్తున్న ట్రేడర్లపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- లైసెన్సుల రద్దు: వ్యాపారం చేయకుండా కేవలం లైసెన్సులు కొనసాగిస్తున్న వారిని గుర్తించి, వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు.
- అధికారులపై చర్యలు: అక్రమ వ్యాపారులకు సహకరించే అధికారులపై కఠిన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డిజిటలైజేషన్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు.
రూ. 568 కోట్లతో అభివృద్ధి పనులు:
గత రెండేళ్లలో మార్కెట్ యార్డుల అభివృద్ధి కోసం రూ. 568.50 కోట్ల వ్యయంతో 630 పనులను మంజూరు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇందులో ఇప్పటివరకు రూ. 128 కోట్లతో 113 పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో (Timeline) పూర్తి చేయాలని, పర్యవేక్షణ కోసం ప్రత్యేక డ్యాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కోహెడ మార్కెట్ అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. గడ్డిఅన్నారం మార్కెట్ను ‘స్మార్ట్ మార్కెట్ యార్డ్’గా మార్చాలని నిర్ణయించారు.
సోలార్ విద్యుత్.. ధాన్యం కొనుగోళ్లు:
విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు మార్కెట్ యార్డుల్లో సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, జూలై చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభం కావాలని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే ధాన్యం కొనుగోళ్ల సీజన్ దృష్ట్యా టార్పాలిన్లు, తేమ కొలమానాలు, డ్రైయర్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, రైతుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తామని భరోసా ఇచ్చారు.
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుదాం.. హరిత భారతాన్ని నిర్మిద్దాం!
గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ మరియు పర్యావరణానికి సంబంధించిన తాజా విశేషాల కోసం హరితమిత్రను సందర్శిస్తూ ఉండండి. నిరంతర వార్తా అప్డేట్స్ కోసం మా సోషల్ మీడియా వేదికలపై కనెక్ట్ అవ్వండి:





