Premier Energies plant Sitarampur : పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ మరో మైలురాయిని అధిగమించింది. ప్రముఖ సోలార్ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్, రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో తన నూతన 5.6 గిగావాట్ల (GW) సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని (Premier Energies plant ) ప్రారంభించింది. ఈ కొత్త ప్లాంట్తో కలిపి కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు 11.1 గిగావాట్లకు చేరుకుంది.
ఏఐ (AI) తో ప్లాంట్ తయారీ!
సుమారు 75 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ యూనిట్, ప్రపంచ స్థాయి సాంకేతికతతో నిర్మించారు. ఇక్కడ ప్రతి 16 సెకన్లకు 4 హై-ఎఫిషియెన్సీ మాడ్యూల్స్ తయారవుతాయి. ఇది అత్యంత ఆటోమేటెడ్ తయారీ లైన్లను కలిగి ఉంది.
మాడ్యూల్ తయారీలో లోపాలను (Faults) వెనువెంటనే గుర్తించి సరిచేయడానికి ఇందులో ఏఐ ఆధారిత ఫాల్ట్ డిటెక్షన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దీనివల్ల నాణ్యత పెరగడమే కాకుండా నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.
అత్యాధునిక జీరో బస్బార్ ఆర్కిటెక్చర్తో కూడిన టాప్కాన్ (TOPCon) టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా అత్యధిక శక్తి దిగుబడిని ఇచ్చే మాడ్యూల్స్ను ఈ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుంది.
భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు మద్దతు
ప్రీమియర్ ఎనర్జీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలూజా మాట్లాడుతూ, “సమీకృత సౌర ఉత్పాదక పర్యావరణ వ్యవస్థలో ఈ ప్లాంట్ ఒక మైలురాయి. ఇంగట్స్ నుండి మాడ్యూల్స్ వరకు పూర్తి విలువ గొలుసులో విస్తరించడం ద్వారా భారతదేశ ఇంధన పరివర్తనకు మేము మద్దతు ఇస్తున్నాము,” అని పేర్కొన్నారు.
చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, దేశీయంగా సామర్థ్యాలను పెంచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోలార్ డిమాండ్ను తీర్చడానికి, సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి ఈ ప్లాంట్ దోహదపడుతుందని అన్నారు.





