Agriculture News | రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలకమైన పంటకోత అనంతర మౌలిక సదుపాయాల అభివృద్ధి (Post Harvest Infrastructure) కి కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించిన Agriculture Infrastructure Fund (AIF) కింద భారీ స్థాయిలో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 1.65 లక్షలకు పైగా ప్రాజెక్టులకు రూ.83,528 కోట్లకు పైగా విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి.
ఇప్పటివరకు 1,46,789 ప్రాజెక్టులకు రూ.61,512 కోట్లు విడుదల కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం చెల్లింపులు రూ.65,000 కోట్లకు చేరే అవకాశం ఉందని వర్గాలు వెల్లడించాయి.
ఏమిటి ఈ మౌలిక సదుపాయాల నిధి (AIF)?
పంటకోత తర్వాత రైతులు ఎదుర్కొనే నిల్వ, రవాణా సమస్యలను పరిష్కరించడమే ఈ నిధి ప్రధాన లక్ష్యం. దీని ద్వారా గిడ్డంగులు, శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్లు), క్రమబద్ధీకరణ-గ్రేడింగ్ యూనిట్లు, రైపనింగ్ ఛాంబర్లు వంటి పంటకోత అనంతర సౌకర్యాలు రైతులు తమ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసి, మధ్యవర్తుల జోక్యం తగ్గించి, నేరుగా మార్కెట్కు విక్రయించేందుకు దోహదపడతాయని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పంట నష్టాలను తగ్గించడం, సరైన సమయంలో విక్రయించడం ద్వారా రైతులకు మెరుగైన ధర లభించే అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు.
లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు సమీకరణ
AIF కింద ఆమోదించిన ప్రాజెక్టులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, కోల్డ్ చైన్ వ్యవస్థలు, గిడ్డంగుల నిర్మాణం వంటి రంగాల్లో అమలవుతున్నాయి. ప్రైవేట్ రంగ సహకారంతో కలిసి లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు సమీకరించబడ్డాయని సమాచారం.
- రుణ సౌకర్యాలు – వడ్డీ రాయితీ
- రూ.2 కోట్ల వరకు రుణ సౌకర్యం
- గరిష్టంగా 7 సంవత్సరాల తిరిగి చెల్లింపు గడువు
- 3% వడ్డీ రాయితీ (9% పరిమితితో)
- ప్రాజెక్టు వ్యయంలో కనీసం 10% వాటా లబ్ధిదారుల నుండి తప్పనిసరి
- బ్యాంకుల క్రెడిట్ గ్యారెంటీ ఫీజుల రీయింబర్స్మెంట్ కూడా కవరేజ్
- రాష్ట్రాల వారీగా ప్రాధాన్యత
AIF కింద మంజూరు చేసిన ప్రాజెక్టుల సంఖ్యలో ముందున్న రాష్ట్రాలు:
ప్రాజెక్టుల మంజూరులో పంజాబ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా, టాప్ 5 రాష్ట్రాల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఆంధ్రప్రదేశ్: 6,212 ప్రాజెక్టులు
- పంజాబ్: 32,906 ప్రాజెక్టులు
- మధ్యప్రదేశ్: 27,597 ప్రాజెక్టులు
- మహారాష్ట్ర: 16,030 ప్రాజెక్టులు
- ఉత్తరప్రదేశ్: 14,679 ప్రాజెక్టులు
రైతులకు చేకూరే లాభం
సాధారణంగా పంట చేతికి రాగానే నిల్వ చేసే సౌకర్యం లేక రైతులు మధ్యవర్తులకు తక్కువ ధరకే పంటను అమ్ముకుంటారు. ఈ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు (Rural Infrastructure Investment) లభిస్తాయి. మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుంది. పంటకోత తర్వాత జరిగే నష్టాలు తగ్గుతాయి. రైతులు నేరుగా వినియోగదారులకు లేదా కంపెనీలకు విక్రయించి మెరుగైన లాభం పొందవచ్చు.





