- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కేంద్రాల ఏర్పాటు..
- అపార్ట్మెంట్లలో చార్జింగ్ పాయింట్లు తప్పనిసరి!
EV Charging Stations Telangana Plan | హరితమిత్ర : రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చార్జింగ్ మౌలిక వసతులను మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ప్రధానాంశాలు ఇవీ..
- సమగ్ర ప్రణాళిక: పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈవీ చార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రావాలని, ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) సమగ్ర వ్యవస్థను రూపొందించాలని సీఎస్ ఆదేశించారు.
- రియల్ టైమ్ డ్యాష్బోర్డ్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈవీ చార్జింగ్ కేంద్రాలను మ్యాపింగ్ చేయడానికి మరియు వాటి పురోగతిని పర్యవేక్షించడానికి ఒక ‘కేంద్రీకృత రియల్ టైమ్ డ్యాష్బోర్డ్’ను అభివృద్ధి చేయనున్నారు. ఇది పారదర్శకతకు దోహదపడుతుంది.
- అపార్ట్మెంట్లలో నిబంధనలు: ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. అపార్ట్మెంట్ భవనాల బేస్మెంట్లలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి (Mandatory) చేసే దిశగా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల నగరవాసులకు ‘హోమ్ చార్జింగ్’ సౌకర్యం సులభమవుతుంది.
EV Charging Stations : హరిత ఇంధనం వైపు అడుగులు:
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. టీజీరెడ్కో (TGREDCO), టీజీఐఐసీ (TGIIC), జీహెచ్ఎంసీ (GHMC) సమన్వయంతో ఈ ప్రాజెక్టును వేగవంతం చేయనున్నారు.
ఈ సమావేశంలో రవాణా, రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రణాళిక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, TGRTC ఎండీ నాగిరెడ్డి, రవాణా కమిషనర్ ఇలంబర్తి, TGIIC వైస్ చైర్మన్ & ఎండీ శశాంక, GHMC కమిషనర్ కర్ణన్, TGREDCO ఎండీ అనిలా వవిల్లా, OEM ప్రతినిధులు పాల్గొన్నారు.





