
న్యూఢిల్లీ: భారతదేశంలో పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మోటారు వాహన నిబంధనలు (Central Motor Vehicles Rules), 1989కి కీలక సవరణలు చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది.
30 రోజుల్లోగా సూచనలు, అభ్యంతరాలు
ఏప్రిల్ 27, 2026న జారీ చేసిన ఈ ముసాయిదాపై ప్రజలు, వాహన తయారీదారులు, ఇతర భాగస్వాములు తమ అభిప్రాయాలను 30 రోజుల్లోగా తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. అందిన సూచనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిబంధనలను ఖరారు చేస్తుంది.
ఇథనాల్ విప్లవం: E20 నుండి E100 వరకు!
పెట్రోల్లో ఇథనాల్ కలిపే ప్రక్రియ (Ethanol Blending) దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తోంది. ప్రభుత్వం అందించిన గణాంకాల ప్రకారం.. ప్రతి ఏటా సుమారు 45 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఆదా అవుతోంది. దీనివల్ల ఇప్పటివరకు ₹1.65 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యింది.
కొత్త మార్పులు: ప్రస్తుతం వాడుకలో ఉన్న E10 పెట్రోల్తో పాటు, E20 (20% ఇథనాల్), E85 (85% ఇథనాల్), ఏకంగా E100 (100% ఇథనాల్) ఇంధనాలను కూడా నిబంధనల్లో చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏప్రిల్ 2023 తర్వాత తయారైన వాహనాలన్నీ E20 ఇంధనానికి అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బయోడీజిల్, హైడ్రోజన్ ఇంధనాల్లో మార్పులు
కేవలం పెట్రోల్ మాత్రమే కాకుండా డీజిల్, హైడ్రోజన్ ఇంధనాల విషయంలోనూ స్పష్టమైన ప్రమాణాలను ప్రభుత్వం ప్రతిపాదించింది:
- బయోడీజిల్ (Bio-Diesel): ప్రస్తుతం ఉన్న B10 (10% బయోడీజిల్) నుండి B100 (100% బయోడీజిల్) వాడకానికి వీలుగా నిబంధనలను విస్తరించనున్నారు.
- హైడ్రోజన్ (Hydrogen): సాంకేతిక స్పష్టత కోసం ‘హైడ్రోజన్+CN’ అనే పదాన్ని ‘హైడ్రోజన్+CNG’గా మార్చాలని నిర్ణయించారు.
పర్యావరణానికి మేలు – సామాన్యుడికి లాభం
ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే, భారతదేశం ఇంధన స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. అధిక స్థాయిలో ఇథనాల్ వాడకం వల్ల వాహన ఉద్గారాలు తగ్గి కాలుష్యం నియంత్రణలోకి వస్తుంది. అలాగే, ప్రత్యామ్నాయ ఇంధనాల లభ్యత పెరగడం వల్ల సామాన్యుడిపై ఇంధన ధరల భారం తగ్గే అవకాశం ఉంది.
హరిత ఇంధనాల దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు, 2070 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించనున్నాయి.

